గాలి జనార్థన్రెడ్డి అరెస్టు
కర్నాటక మాజీ మంత్రి, గాలి జనార్థన్రెడ్డిని సిబిఐ అధికారులు సోమవారం ఉదయం 6.30 గంటలకు ఆయన ఇంట్లో అరెస్టు చేశారు. అలాగే ఓఎంసీ ఎండి శ్రీనివాసరెడ్డిని కూడా అరెస్టు చేశారు. బళ్ళారిలో అక్రమ మైనింగ్ జరిగినట్టు ఈ మధ్యే లోకాయుక్త తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే సిబిఐ అధికారులు గాలి జనార్థన్రెడ్డిని, శ్రీనివాసరెడ్డిని అరెస్టు చేశారు. ఆయనపై 120(బి), 420, మైనింగ్, ఫారెస్ట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బెంగుళూరు, బళ్లారిలలో ఉన్న గాలి జనార్థన్రెడ్డి ఇళ్ళల్లో సిబిఐ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో విలువైన డాక్యుమెంట్స్ ని కొన్నింటిని సిబిఐ అధికారులు చేజిక్కించుకున్నారని తెలుస్తోంది. యడ్యూరప్ప కేబినెట్లో గాలి జనార్థన్రెడ్డి మంత్రిగా పనిచేసారు. సోమవారం మధ్యాహ్నం సిబిఐ కోర్టులో గాలి జనార్థన్రెడ్డి హాజరుపరిచే అవకాశం ఉంది. గాలి జనార్థ్రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. అలాగే గాలి బ్రదర్స్కి సంబంధించిన హెలికాప్టర్ని కూడా సీజ్ చేశారు. అక్రమ మైనింగ్ వ్యవహారానికి సంబంధించిన దర్యాప్తు నెల రోజుల క్రితమే పూర్తయింది. నెలక్రితమే గాలి జనార్థన్రెడ్డిని అరెస్టు చేయాల్సి ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో జగన్ ఆస్తుల వ్యవహారం తెరపైకి రావడంతో ఈరోజు గాలిని అరెస్టు చేశారు. అయితే ఈ అరెస్టు జగన్ ఆస్తుల వ్యవహారానికి సంబంధించి కాదని, అక్రమ మైనింగ్ కేసులోనే గాలి జనార్థన్రెడ్డిని అరెస్టు చేసినట్టు సిబిఐ అధికారులు తెలుపుతున్నారు. గాలి జనార్థన్ రెడ్డి అరెస్టుతో అటు కర్నాటకలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టు విశ్లేషకులు అనుమానిస్తున్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి