మంత్రివ‌ర్గంలో భారీ ప్ర‌క్షాళ‌న‌..?


 మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు భారీ గా ఉండొచ్చని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి  ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి  ఇప్పటికే కసరత్తు  పూర్తీ చేసారని సమాచారం .మార్పుల చేర్పుల జాబితా పై అధిష్టానం ఆమోద ముద్ర వేయించు కోవడమే తరువాయి అంటున్నారు . నెలాఖరులోగా  ముఖ్యమంత్రి  డిల్లీ వెళ్ళే అవకాశాలున్నాయి .పనితీరు, సామాజిక వర్గం, విధేయత ప్రాతిపదికన మంత్రివర్గ మార్పులు ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత మంత్రుల్లో కనీసం 5 -6  మందిని తొలగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది . ముఖ్యమంత్రి సన్నిహితుల కథనం ప్రకారం మంత్రివర్గం నుంచి స్థానం కోల్పోనున్న వారిలో పి శంకరరావు, సబితా ఇంద్రారెడ్డి, పి విశ్వరూప్, కాసు వెంకట కృష్ణారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అహ్మదుల్లా పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వ్యవసాయమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, దేవాదాయ మంత్రి జూపల్లి కృష్ణారావు మంత్రి పదవులకు ఇంతకు ముందే రాజీనామా చేశారు. అలాగే పిసిసి అధ్యక్షునిగా నియమితులైన కారణంగా బొత్స సత్యనారాయణ కూడా  రాజీనామా చేయబోతున్నారు . మంత్రివర్గ మార్పుల్లో ఈ మూడు ఖాళీలను కూడా భర్తీ చేస్తారు .
కొత్తగా మంత్రివర్గంలో స్థానం లభించవచ్చని అనుకుంటున్న వారిలో ప్రజారాజ్యం పార్టీకి చెందిన గంటా శ్రీనివాసరావు, సి రామచంద్రయ్యల పేర్లు గట్టిగా  వినిపిస్తున్నాయి. పీఆర్పీ కి మూడో పదవి ఇచ్చేలా వుంటే  వంగా  గీత కు ఛాన్స్ లభించ వచ్చు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రులు గాదె వెంకటరెడ్డి, జెసి దివాకర్‌రెడ్డిలతో పాటు ఎమ్మెల్యేలు ప్రసాద్‌కుమార్, పాముల రాజేశ్వరీ దేవి, కొండ్రు మురళి, జివి శేషు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.  చేనేత, జౌళి శాఖ మంత్రి పి శంకరరావును, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని తొలగింఛి  వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాదకుమార్‌కు  అవకాశ మిస్తారని అంటున్నారు . శంకరరావును తొలగించినప్పటికీ అదే సామాజిక వర్గానికి చెందిన వృద్ధ నాయకుడు జి వెంకటస్వామి దగ్గర బంధువు  ప్రసాద్‌కుమార్‌కు మంత్రి పదవి ఇచ్చి ఆ వర్గం లో  అసంతృప్తి రాకుండా  చూడాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది .ఇక బొత్స స్థానం లో   బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావుకు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. విజయనగరం జిల్లా రాజకీయాల్లో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, సుజయ్ కృష్ణ రంగారావుకు పడదు. జిల్లాలో బొత్స కు చెక్ పెట్టేందుకు కిరణ్  రంగారావుకే మంత్రివర్గంలో స్థానం కల్పించవచ్చు అంటున్నారు . రంగారావుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సత్సంబంధాలే ఉన్నాయి. . తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి  విశ్వరూప్‌ను తొలగించాలన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి ఉన్నట్టు సమాచారం .అయితే  విశ్వరూప్  తో బొత్సకు మంచి సంబంధాలు వున్నాయి. కాగా తూర్పు గోదావరి జిల్లా గన్నవరం ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీ దేవి, శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొండ్రు మురళి,  ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జివి శేషు ల పేర్లు కూడా  పరిశీలనలో వున్నట్టు తెలుస్తోంది.
గుంటూరు జిల్లాలో మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డిని తొలగించి మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డికి మళ్ళీ మంత్రివర్గంలో స్థానం కల్పించవచ్చని భావిస్తున్నారు. మంత్రిగా ఆయన పనితీరు సంతృప్తికరంగా లేకపోవడం ఇందుకు  కారణమని చెబుతున్నారు.
కడప జిల్లాలో మంత్రి అహ్మదుల్లాను తొలగించి అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహ్మద్ జానీకి మంత్రివర్గంలో స్థానం కల్పించవచ్చని అనుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డికి అవకాశం లభించవచ్చని భావిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా మంత్రివర్గం నుంచి తొలగించవచ్చని అంటున్నారు. కానీ అది అంత సులభం కాదేమోనని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఈ ఊహాగానాల ప్రకారం చూస్తే  కాబినెట్ లో భారీ మార్పులు  జరగాలి . ఇంకా సీఎం గా తనే సుస్తిరం కానీ నేపధ్యం లో  కిరణ్ ఇంత సాహసానికి పూనుకుంటారా అనేది కూడా సందేహమే. ఒకే సారి భారీ మార్పులంటే అధిష్టానం కూడా అంగీకరించక పోవచ్చు.అంగీకరిస్తే మటుకు  మంత్రి వర్గ విస్తరణ కిరణ్ కి మరో అగ్ని పరీక్ష అయ్యే ప్రమాదం కూడా లేక పోలేదు .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!