17వ శతాబ్దిలోనే టిప్పుసుల్తాన్ రాకెట్ ప్రయోగించాడా!

అక్షరాలా భారత అంక్షరిక్ష పరిశోధనా చరిత్ర కర్నాటకలోని శ్రీరంగ పట్నం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వరకు పయనించిందంటే బహుశా చాలామంది నమ్మలేరు. నమ్మలేకున్నా ఇది నిజమే.. ఎందుకంటే అంతరిక్షంలోకి ప్రస్తుతం ప్రపంచం నలుమూలలనుంచి దూసుకెళుతున్న రాకెట్‌ల పరిజ్ఞానాన్ని మానవ చరిత్రలో మొదటిసారిగా కనిపెట్టింది మన భారతీయుడే.. మన టిప్పుసుల్తాన్ అనేదే ఆ నమ్మలేని నిజం.
  ప్రపంచంలో మొట్టమొదటి .యుద్ధ రాకెట్‌ను కనిపెట్టింది టిప్పు సుల్తానే మరి. 17వ శతాబ్దంలో తన రాజధాని శ్రీరంగపట్నంలో టిప్పుసుల్తాన్ మొదలెట్టిన భారతీయ రాకెట్ మహా ప్రస్థానం ఇప్పుడు చంద్రయాన్1 ప్రయోగ వేదిక అయిన శ్రీహరికోటలో తారాస్థాయికి చేరింది.
 బ్రతికి ఉన్నంతవరకూ భారత్‌లో బ్రిటిష్ సైన్యాలను ముప్పుతిప్పలు పెట్టిన టిప్పు సుల్తాన్ 1799లో కర్నాటకలోని తురకనహళ్లిలో జరిగిన భీకర యుద్ధంలో వీరమరణం పొందిన తర్వాతే ఆయన రూపొందించి అభివృద్ధి చేసిన చరిత్రలో మొట్టమొదటి రాకెట్ కథ బయటి ప్రపంచానికి తెలిసింది.
  టిప్పు వీరమరణం తర్పాత ఆయన సైనిక స్థావరాన్ని స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ సేనాని విలియం కాంగ్రెస్ ఆ స్థావరంలో 1600 యుద్ధరాకెట్లు కనుగొని నివ్వెరపోయాడు. తమ జ్ఞానానికి మించిన నూతన యుద్ధ తంత్రం ఒక ప్రాచ్యదేశంలో బయటపడగానే తక్షణం ఆ రాకెట్లను ఇంగ్లండ్ తరలించారు. టిప్పు ఆ యుద్ధంలో బతికి ఉంటే అనే ప్రశ్నలు సమాధానం ఇవ్వవు.   కాని ఇంగ్లండ్ చేరిన టిప్పు రాకెట్లతో పాటు దాని పరిజ్ఞానం కూడా దేశం దాటిపోయిందంటే నమ్మాలి మరి. అత్యంత ప్రాథమిక జ్ఞానంతో టిప్పు రూపొందించిన తొలితరం యుద్ధ రాకెట్ కేవలం రెండు కిలోల బరువు ఉండేది. అయిదు సెంటీమీటర్ల వెడల్పు, 25 సెంటీమీటర్ల పొడవు ఉన్న ఈ రాకెట్‌లో కిలో గన్ పౌడర్ దట్టించి దానినే ఇంధనంగా మండిస్తూ ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్న శత్రువులను సైతం గడగడలాడించే వారు. మైసూరు సమీపంలోని శ్రీరంగపట్నంలో రాకెట్ లాంచ్‌ప్యాడ్‌లు సైతం ఉండేవని చరిత్రకారుల భావన.

  ఆలా మానవ చరిత్రలో మొదటి సారిగా టిప్పుసుల్తాన్ కనుగొన్న యుద్ధ రాకెట్ పరిజ్ఞానం ఆయన అనూహ్య మరణంతో ఆంగ్లేయుల హస్తగతమై 150 సంవత్సరాల పాటు మరుగున పడి ఉండటం మరింత ఆశ్చర్యం గొలిపిస్తుంది. తర్వాత 20వ శతాబ్ది మొదట్లో అంటే 1903లో రష్యాకు చెందిన కాన్‌స్టాంటిన్ షల్కోవస్కీ, అమెరికా సైంటిస్టు రాబర్ట్ గోడాన్ (1914), జర్మనీలో హెర్మన్ ఓబెర్త్‌ (1923) యుద్ధరాకెట్లకు మరితం ఆధునికత జోడించిన ఫలితంగా 1950ల మధ్యలో అంతరిక్ష విజ్ఞానం కొత్త పుంతలు తొక్కింది.
   మరుగున పడిన ఈ భారతీయ మహా యుద్ధ తంత్ర చరిత్రకు పరమ సాక్షీభూతంగా టిప్పు సుల్తాన్ చిత్రపటం అమెరికా అంతరిక్ష కేంద్రమైన నాసాలో ఈ నాటికీ ఉంది. 17వ శతాబ్దానికి చెందిన భారతీయ రాజు చిత్రపటానికి నాసాకు ఉన్న సంబంధం ఏమిటి? అంతరిక్షానికి, టిప్పుసుల్తాన్ తొలి ప్రయోగానికి, మానవ జ్ఞాన పరంపరకు ఉన్న సంబంధం అది....

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!