పర్యావరణ గణపతి


మహాగణపతి పూజ వెనుక అనేక పర్యావరణ సూత్రాలను పొందుపరిచారు మన పూర్వీకులు. వినాయక చవితి పూజా విధిలో ఈ సూత్రాలను పాటిస్తుంటాం…
1. కొత్త మట్టితో వినాయకున్ని తయారుచేయడం
2. ఇరువైఒకటి పత్రాలతో పూజ చేయడం
3. నవరాత్రుల అనంతరం పత్రితోసహా వినాయక ప్రతిమను నిమజ్జనం చేయడం.

శివపార్వతుల ముద్దుబిడ్డ వినాయకుడు. ఆయన జన్మంలోనే పర్యావరణ రహస్యం దాగుంది. నలుగుపిండితో తయారైన బొమ్మకు ప్రాణప్రతిష్ట చేసింది ఆది శక్తి పార్వతీదేవి. అనంతరం, ఏనుగు తలను అతికించి పునఃప్రాణప్రతిష్ఠ చేశారు ఆదిదేవుడు పరమేశ్వరుడు. ఆనాటి నుంచి యుగాలు దొర్లుతున్నా, కాలం మారుతున్నా, మహాగణపతి పూజలందుకుంటూనే ఉన్నాడు.
సమాజంలో అనేక వర్గాలవారుంటారు. వారందరినీ, కలిపి మానవత్వమే మహా మతం అన్న ఏకైక నినాదంతో కూడుకున్నదే మహాగణపతి పూజ. ఈ సృష్టిలో సర్వజీవులు సమానమే అని చాటిచెప్పడమే వినాయక జనన రహస్యం. మానవ రూపంలో ఉన్న వినాయకునికి గజ శిరస్సు అమర్చడం, ఆపైన మూషికుడ్ని (ఎలుకను) వాహనంగా అమర్చడంలోనే సర్వప్రాణులు సమానమనే అర్థం స్ఫురిస్తోంది. ఆహారంగా ఔషధ మొక్కల ఆకులు తినడంలోనే పర్యావరణ రహస్యం దాగుంది.

మట్టి వినాయకుడు- అసలు రహస్యం
అలాంటి వినాయకుడి విగ్రహాన్ని కొత్త మట్టితోనే చేయాలని చెప్పేవారు పూర్వీకులు. కొత్త మట్టి అంటే, తొలకరి జల్లులు పడిన తరువాత మట్టివాసన వెదజల్లే సమయంలో తీసిన మట్టి అని అర్థం. ఈ మట్టిని వినాయకచవతికి ముందే, అంటే, వర్షాకాలం ఆరంభానికి ముందే తవ్వితీస్తారు. మట్టి తవ్వాలంటే, సహజంగానే ఎవరైనా చెరువులు, కుంటల దగ్గరకే వెళతారు. అలా చేయాలనే ఈ పనిని పురమాయించారు పెద్దలు. వర్షాకాలం వచ్చిందంటేచాలు, చెరువులు, వాగులు, కుంటలు నిండిపోతాయి. మరీ ఎక్కువగా వానలు పడితే, పక్కనే ఉన్న ఊర్లు మునిగిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే, చెరువులకు, వాగులకు, కుంటలకు పూడికలు తీయాలి. నీరు నిల్వఉండాలేకానీ, అవి ఊర్లమీద పడకూడదు. వానల వల్ల మట్టి కొట్టుకెళ్ళి చెరువుల్లో చేరిపోతుంటుంది. కాబట్టి ముందుగా పూడిక తీయాల్సిందే. ఆపని పూర్వం రోజుల్లో గ్రామస్థులే చేసేవారు. అలా చేసేందుకు, ఉత్సాహంగా ఆ పని పూర్తి చేసేందుకు మతపెద్దలు వినాయక ప్రతిమలను మట్టితోనే చేయాలన్న నిబంధన పెట్టారు.
పత్రి పూజ – రహస్యం
గణనాథుడ్ని 21 పత్రితో పూజించడం ఆచారంగా వస్తున్నది.   అలా తొమ్మిది రోజులు చేయమని కూడా శాస్త్రం చెబుతోంది. పత్రి పూజకు మనం ఎంచుకునేవి మామూలు ఆకులు కాదు. అవి ఔషధమొక్కలకు సంబంధించిన ఆకులు. అందుకే వ్రతకల్పంలో పేర్కొన్న పత్రాలతోనే పూజించాలేకానీ, వేరేవాటితో చేయకూడదు.  ఔషధ పత్రాల నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలిస్తాయి. దీంతో ఊర్లో అనారోగ్య సమస్యలు తొలిగిపోతాయి. వైరస్, బాక్టీరియా వంటి వాటివల్ల ఇబ్బందులు పోతాయి. ఇలా తొమ్మిది రోజులు చేయడమన్నది వైద్యుల పరిభాషలో చెప్పాలంటే ఒక కోర్సు. ఏ మందైనా డాక్టర్ ఇచ్చేటప్పుడు మూడు రోజులో, వారం రోజులో వాడమని చెప్పినట్టుగానే, పూర్వీకులు పత్రిలోని ఔషధ గుణాలతో ఊరు బాగుపడాలంటే, తొమ్మిది రోజులు పూజలు చేయమని చెప్పారు. ఇదే అసలు రహస్యం.
నిమజ్జనం – అసలు రహస్యం
నవరాత్రుల తరువాత వినాయక ప్రతిమను సమీపంలోని చెరువులోనో, లేదా కుంటలోనూ నిమజ్జనం చేయడం కూడా ఆచారంగానే వస్తున్నది. చెరువులు, కుంటలు లేని చోట బావిలోనే నిమజ్జనం చేయవచ్చు. 21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలిశాక, 23 గంటలకు తమలోని ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్ ను జలంలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బాక్టీరియా నశిస్తుంది. అంతేకాదు, ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగున్న పర్యావరణ పరమ రహస్యం.

- తుర్లపాటి నాగభూషణ రావు,ఎంఎస్సీ (బోటనీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!