గొడవంతా ఇందుకోసమేనా..?
తెలంగాణ సమస్యను ఎలా తేల్చాలో తెలియన తలపట్టుకుంటున్నారు హైకమాండ్ పెద్దలు. కానీ ఇదేమంత పెద్ద సమస్యేమీ కాదంటున్నారు రాయలసీమకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు. అసలు తెలంగాణ ఉద్యమం ముఖ్యమంత్రి పదవి కోసమే వచ్చిందని కొత్త అర్థం చెప్పారు టీజీ వెంకటేశ్, జేసీ దివాకర్ రెడ్డి. ముఖ్యమంత్రి పదవి కోసమే ఈ గొడవంతా అని.. పదవిని సీమాంధ్రకు మూడేళ్లు.. తెలంగాణకు రెండేళ్లు ఇస్తే.. అసలు సమస్యే ఉండదని ఇద్దరు నేతలు స్పష్టం చేశారు. కాగా టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ.. తెలంగాణ వాదుల దాడులను ఎదుర్కొనేందుకు సీమ ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఆంధ్ర ప్రాంతం వారు కూడా ఓ ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పోరాడుతుండటంతో పాటు.. ఆంధ్ర, రాయలసీమల్లో రాజధానులు ఏర్పాటు చేసేందుకు కూడా పోరాడాలని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.