`అనంత’ సంపద వెనుక కన్నీటి కథలు- 4


కేరళ తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయం నేల మాలిగలోని అపార సంపద వెనుక దాగున్న కన్నీటి కథలు రాద్దామని మొదలు పెట్టిన ఈ వ్యాసపరంపర నిజానికి మూడో పార్ట్ తోనే ముగిసినట్టు భావించాను.  కానీ, ఇదో అనంత ప్రవాహంలా సాగేలా ఉంది. అందుకే మళ్ళీ మొదలుపెట్టాల్సి వచ్చింది…

అనంత పద్మనాభుని సంపద ఎంతో భక్తులకు చాటిచెప్పాలని కోర్టుకెక్కిన సుందర రాజన్ హఠాత్తుగా మరణించడం ఈ కన్నీటి కథల్లో తాజా మలుపు.
నేలమాలిగల్లో ఇటీవల లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పురాతన సంపద వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. అసలు ఈ సంపద గురించి బయట ప్రపంచానికి తెలియడానికి ప్రధాన కారణమైన, నేలమాలిగలు తెరవాలని న్యాయపోరాటం చేసిన వ్యక్తి సుందరరాజన్.
ఆయన వయోభారంతో మరణించారా…లేక ఏదైనా బలమైన కారణం ఉన్నదా అన్నది ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. ఏడుపదుల వయసులో కూడా సుందర రాజన్ నిన్నమొన్నటి వరకు హుషారుగానే తిరిగారు. ఆలయం పక్కనే వారి ఇల్లు. ఆయన గతంలో ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేశారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన భద్రతా విభాగంలో కీలక బాధ్యతలే చేపట్టారు. ఆ తరువాత న్యాయవాదవృత్తిలో స్థిరపడ్డారు. సుందరరాజన్ తండ్రి రాజవంశస్థుల దగ్గర న్యాయ సలహా దారునిగా పనిచేశారు. బహుశా, అందుకనేనేమో, ఆలయంలోని నిధినిక్షేపాల గురించిన కీలక సమాచారంపై ఆయనకు అవగాహన ఏర్పడి ఉంటుంది. అంతేకాదు, రాజవంశస్థులు `అనంత’ సంపదపై తమదే పూర్తి హక్కులన్నట్టుగా మాట్లాడటం కూడా ఆజన్మబ్రహ్మచారి అయిన సుందర రాజన్ ను బాధించింది. ఒకప్పుడు ఇదే రాజవంశస్థులు (మార్తాండవర్మ) మొత్తం రాజ్యాన్నే అనంత పద్మనాభుని పాదాల చెంతన ఉంచారు. రాజు కూడా పద్మనాభదాసుడేనని ప్రకటించారు. అలాంటి రాజవంశస్థుల్లో క్రమేణా ఆలోచనల్లో మార్పు వచ్చిందని స్థానికులు చెప్పుకుంటున్నారు. స్వామివారికి వచ్చిన కానుకలను సైతం తమ సొంత సొమ్ముగా భావించే మనస్తత్వం మొగ్గతొడగడంతోనే సుందర రాజన్ ఈ సంపదను ప్రపంచానికి తెలియజెప్పాలని కంకణం కట్టుకున్నారు. అందుకే ఆయన కోర్టును ఆశ్రయించారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఒక కమిటీని నియమించి నేలమాలిగల్లోని గదులను తెరిపించే పనికి పూనుకుంది. ఇప్పటికే ఐదు గదులు తెరిచారు. లక్షన్నర కోట్ల రూపాయల సంపద బయటపడింది. మార్కెట్ విలవ ప్రకారం ఇది ఐదులక్షల కోట్ల రూపాయలకు పైమాటే అంటున్నారు.
సహజ మరణమేనా?
ఆ జన్మ బ్రహ్మచారి అయిన సుందరరాజన్ రెండు రోజుల పాటు జ్వరంలో బాధపడి హఠాత్తుగా మృతి చెందారు. కానీ తన సంపదను బయటకు తీసి లెక్కించడంపై అనంత పద్మనాభుడు కన్నెర్ర చేశాడా? లేక నేలమాలిగల్లోని నిధులకు కాపలా ఉన్నట్లు చెబుతున్న నాగరాజస్వామి కాటేశాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సుందర రాజన్ కూడా పద్మనాభుని భక్తుడే. ఆయన తన జీవితాన్ని స్వామి సేవకే అంకితం చేశారు. అలాంటి వ్యక్తిపై పద్మనాభుడు కన్నెర్ర చేస్తాడా?
సుందరరాజన్ మృతిపై ప్రచారం ఉన్నట్టుగానే ఇప్పుడు తిరువనంతపురంలో మరో ప్రచారం ఊపెక్కింది.
కోనేటి సంపదను తాకితే ప్రళయం తప్పదని వార్తలు వస్తున్నాయి. తిరువనంతపురం శ్రీ పద్మనాభ ఆలయం పుష్కరిణిలో వెలకట్టలేని సంపద ఉందని ప్రచారం జరుగుతోంది. ఆలయానికి ఎదురుగా ఉన్న కోనేరులో అంతులేని సంపద దాగి వుందని ప్రచారం జోరందుకుంది.
మైసూరు రాజా టిప్పు సుల్తాన్ బారి నుంచి, ఆ తర్వాత బ్రిటిష్ వారి నుంచి దేవాలయ నిధులను పరిరక్షించే ఉద్దేశంతో ఆలయ బాధ్యతలు చూస్తున్న ట్రావెన్ కోర్ రాజులు కొంతభాగం నిధి నిక్షేపాలను కోనేటి అడుగున దాచి ఉంచారట.
నాగబంధనం ఆరోగదికే పరిమితమా…లేక మొత్తం అన్ని గదులుకు కలిపి బంధనం వేశారా..?  అదే నిజమైతే ఐదు గదులు తెరవడం వల్లనే నాగుపాములు పగబట్టి సుందర రాజన్ ను చంపేశాయా? లేక రాజవంశస్థుల హస్తం ఏదైనా ఉన్నదా…? ఈ వివరాలు తరువాయి భాగంలో…
- తుర్లపాటి నాగభూషణ రావు
98852 92208

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!